ప్రశ్నిస్తే పీడి కేసులు
== నిలదీస్తే ఐటీ, ఈడీ దాడులు
== ప్రతిపక్షాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న రాజ్యం
== కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్
== 359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర
== భట్టి పాదయాత్రకు సంఘీభావం తెలిపిన వీహెచ్
== పాదయాత్ర చేసిన హనుమంతురావు
(మధిర/ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ప్రభుత్వం ఏం చేసిన అడగొద్దు.. అడిగితే, ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నరు.. గట్టిగ అడిగితే రౌడీ షీట్ కేసులు.. ఇంకా గట్టిగ ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నరు.. నిజాంనిరంకుశ పరిపాలనను తలపిస్తున్న ఈ ప్రభుత్వం హాయంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే గొంతునొక్కేస్తున్నరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై ద్వజమెత్తారు.ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన రాజ్యం ప్రశ్నించే వారిని నిర్బంధించే పని చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 27వ రోజు గురువారం మధిర మండలం చిలుకూరు, దొడ్డ దేవరపాడు, వెల్లంకి సర్కిల్, తొండల గోపవరం, తొర్లపాడు, సాయిపురం గ్రామాల మీదుగా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది.
also read :-ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి ఒకరు మృతి: ముగ్గురికి తీవ్ర గాయాలు
చిలుకూరు గ్రామ సర్పంచ్ సంధ్య వంశీలు భారీ గజమాలతో సీఎల్పీ నేతను సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు. ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనంతరం ఆయా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. టిఆర్ఎస్ నాయకుల అవసరాలు తీర్చడం కోసం పోలీసులు రాష్ట్రంలో పని చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థ పైన టిఆర్ఎస్ నాయకుల ఆజమాయిషీ, పెత్తనం చెలాయిస్తూ రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థులను, ప్రశ్నించిన వారిని వెంటాడి వేటాడి రాజకీయ కక్ష సాధింపుతో అక్రమ పీడీ యాక్ట్ కేసులు పెట్టిస్తున్నారని, సమాజానికి మంచిది కాదని సూచించారు. పీడీ యాక్ట్ కేసులు పెట్టేంత నేరం ప్రతిపక్ష నాయకులు ఏం చేశారో చెప్పకుండా పోలీసులు పెడుతున్న అక్రమ కేసుల పై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు.
also read;-కూసుమంచి పీహెచ్ సీ అద్భుతంగా ఉంది
పోలీసు పోలీస్ గా చేయాల్సిన బాధ్యతను విస్మరించడం వల్లనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు.
ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తాజాగా ఖమ్మంలో సాయి గణేష్, రామాయంపేటలో సంతోష్ అతని తల్లి పద్మలు సజీవదహనం చేసుకున్న ఘటనలు వెలుగుచూశాయన్నారు. రాజకీయ పరమైన సిఫారసులతో రాష్ట్రంలో పోలీసుల పోస్టింగులు జరగడం వల్లనే పోలీసులు పాలకపక్ష పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం తెలంగాణ సమాజానికి మంచిది కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమ్మన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నడుం బిగించానని తెలిపారు.
also read;-భట్టి పాదయాత్ర కు వీహెచ్ సంఘీభావం
ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. గత 27 రోజులుగా మధిర నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పాదయాత్ర చేసిన గ్రామాల్లో వందల సమస్యలు తన దృష్టికి ప్రజలు తీసుకువచ్చారని చెప్పారు. తన దృష్టికి వచ్చిన సమస్యలతో పాటు ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం కొరకు గొంతుక గా అసెంబ్లీలో తన గలం వినిపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ మొండి వైఖరి అవలంబించి నిర్లక్ష్యం వహిస్తే ప్రగతి భవన్ గేటు బద్దలు కొట్టుకుని వెళ్ళీ సీఎంను నిలదీసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని వెల్లడించారు
== 359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న పాదయాత్ర
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 27 రోజుల పాటు ముదిగొండ చింతకాని బోనకల్లు మధిర మండలాల్లో 84 గ్రామ పంచాయతీల్లో కొనసాగింది. దాదాపుగా359.7 కిలోమీటర్లు పూర్తిచేసుకున్నది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వ్యక్తిగత సమస్యలతోపాటు గ్రామ సమస్యల సంబంధించిన పత్రాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రతి గ్రామంలో ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా, ధరణి సమస్యలను పరిష్కరించాలని వచ్చిన విజ్ఞప్తుల ను భట్టి విక్రమార్క స్వీకరించారు. అదేవిధంగా పాఠశాల లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గ్రామాల్లో సిసి రోడ్లు, బిటి రోడ్లు, చెరువుల మరమ్మతులు, చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు సీఎల్పీ నేతకు మొరపెట్టుకున్నారు.
== భట్టి పాదయాత్ర కు వీహెచ్ సంఘీభావం
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపీ వి.హెచ్ హనుమంతరావు సంఘీభావం ప్రకటించి తన మద్దతు తెలిపారు. గురువారం మధిర మండలం తొండల గోపవరం గ్రామానికి చేరుకొని భట్టి పాదయాత్రకు స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను అభినందిస్తూ ఆయన వెంట పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అడుగులో అడుగులు వేస్తూ కదం తొక్కారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని అన్నారు. భూమికి ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదనే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి తెలుసుకోవాలని సూచించారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ఇలాంటి రౌడి పరిపాలనను ఎక్కడ చూడలేదన్నారు. చిన్నచిన్న పోరగాళ్లను కేసులు పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా దారుణంగా హింసకు గురి చేస్తుండటం మంచి పద్దతి కాదన్నారు. 136ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు అధికారంలో ఉందని, కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించేవారిని ఇబ్బందిపెట్టిన పాపాన పోలేదన్నారు. ఇదేక్కడి మాయదారి గవర్నమెంట్ రా బాబు.. మాట్లాడితే నోళ్లు నొక్కేస్తున్నరు అంటూ ఆరోపించారు. ప్రశ్నించేవారి నోళ్లు నొక్కితే, రాబోయే ఎన్నికల్లో ప్రజలే మీ నోళ్లు నొక్కేస్తరని అన్నారు. ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, ఐఎన్ టిసి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, మధిర మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మధిర టౌన్ అధ్యక్షుడు మిర్యాల రమణగుప్తా నాయకులు తదితరులు పాల్గొన్నారు.