గ్రానైట్ పరిశ్రమలను బతికించండి
– మంత్రి కేటీఆర్ కు అసోసియేషన్ వినతి
(హైదరాబాద్, -విజయం న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త మైనింగ్ చట్టాన్ని సవరించి గ్రానైట్ పరిశ్రమలను బతికించాలని పరిశ్రమల యజమానులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ప్రతినిధులు సోమవారం అసెంబ్లీ ఆవరణలో మంత్రి కేటీఆర్ ను కలిశారు. భారీగా పెంచిన రాయల్టీ ధరల వల్ల పరిశ్రమలు నడపలేని పరిస్థితి వచ్చిందని వాపోయారు.
also read :-కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రైతు రాజ్యం భట్టి విక్రమార్క
కొత్త క్వారీల లీజులు, పర్యావరణ అనుమతులు ఇప్పించి, పారిశ్రామిక తెలంగాణ అభివృద్ధికి పాటు పడాలని కోరారు. సంక్షోభం నుంచి గ్రానైట్ రంగాన్ని బయటపడేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు. అసోసియేషన్ వినతిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ ను కలిసిన వారిలో గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), సభ్యులు
టి. రవీందర్ రావు, శ్రీధర్,తమ్మినేని వెంకట్రావుమంకెన శేఖర్, ఫెమీ అద్యక్షులు సి. ఎస్. రావు, క్రషర్ మిల్లర్ల సంఘం ప్రతినిధి కుమార్ రాజు తదితరులు ఉన్నారు.