Telugu News

జర్నలిస్ట్ సమస్యలపై ఉద్యమిస్తా: మందకృష్ణ మాదిగ

విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ

0

జర్నలిస్ట్ సమస్యలపై ఉద్యమిస్తా: మందకృష్ణ మాదిగ

— జర్నలిస్టులకు అన్ని సదుపాయాలతో కూడిన గృహ వసతిని ఏర్పాటు చేయాలి

— జర్నలిస్టులకు జర్నలిస్ట్ బంధు ఇవ్వాలి

— దళిత జర్నలిస్టులకు దళితబందు వర్తింపజేసేందుకు సీఎం నేరుగా ఆదేశాలు జారీచేయాలి

— సమాచారశాఖకు ప్రత్యేక మంత్రిని ఏర్పాటు చేయాలి

— 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

— ప్రతి ఆర్నెళ్లకోమారు
సీఎం సమీక్షించాలి

— విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ

ఖమ్మం, డిసెంబర్ 6(విజయం న్యూస్) : తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి స్వరాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలిస్టులకు 2014 టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కులం, మతం, చిన్న, పెద్ద పత్రికలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీచేయాలని, రైతుబంధు, దళితబంధు తరహాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా జర్నలిస్టు బంధు ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.

Allso read:- రైతులకు శాపంగా ‘ధరణి’ : భట్టి విక్రమార్క

మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార శాఖకు ప్రత్యేక మంత్రి, పూర్తి స్థాయి కమీషనర్ లేకపోవడం విచారకరమన్నారు. సమాచారశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండటం వల్ల జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వంలోనూ సమాచారశాఖకు ప్రత్యేక మంత్రి ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలో సమాచార శాఖను మరో మంత్రికి అప్పగించాలని సీఎం కేసీఆర్ కు విన్నవించారు. ఈ అంశాన్ని డిమాండ్ గానో, హెచ్చరిక గానో కాకుండా న్యాయబద్దంగా భావించి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని కోరుతున్నట్టు తెలిపారు.

Allso read:- ప్రజలందరు బాగుండాలని పూజలుచేసిన మంత్రి

సీఎం కేసీఆర్ నాయకత్వంలో జర్నలిస్టు సంఘాలతో ప్రతి 6 నెలలకొకసారి జర్నలిస్టుల సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించాలని కోరారు. 2014 ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదన్నారు. జర్నలిస్టులు అందరికి అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డుల విషయంలో కూడా అసంపూర్ణంగానే ఉందన్నారు. హెల్త్ కార్డులు పనిచేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 2014 టిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకారం జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు, ఇండ్లు కట్టించి ఇవ్వడం తదితర హామీలు రాష్ట్ర వ్యాప్తంగా 10 శాతం కూడా అమలు కాలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. దేశ వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగంలో ఉన్నట్టు ప్రభుత్వం పదేపదే చెబుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. జర్నలిస్టుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వెనకబడి ఉందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం ఉందన్నారు.

Allso read:- ’సండ్ర‘ ఇంటి స్థలంపై నీలినీడలు

ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. జర్నలిజంలో అత్యధికంగా పేదలు, బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నందున దళిత బంధుతరహాలో జర్నలిస్టు బంధు పథకాన్ని వెంటనే ప్రకటించాలన్నారు. ఇప్పటికే అమలవుతున్న దళితబంధు పథకంలో మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ముఠా గోపాల్ వారి వారి పరిధిలో దళిత జర్నలిస్టులకు దళితబంధు పథకాన్ని మంజూరుకు చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలందరూ దళిత జర్నలిస్టులకు దళితబంధు పథకం మంజూరయ్యేలాగా సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి కొన్ని చానల్స్, పత్రిక యాజమాన్యాలు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆ సమయంలో తెలంగాణ ఉద్యమానికి చిన్న పత్రికలు అండగా ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదన్నారు. చిన్న పత్రికల సమస్యలకు ఎలాంటి తారతమ్యాలు లేకుండా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.

Allso read:- ఎఫ్ఆర్వో  శ్రీనివాస్ రావు కుటుంబాన్ని పరామర్శించిన తుమ్మల

నూతనంగా ఏర్పాటైన మహాజన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ లోగా అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండల కేంద్రాల్లో నిర్మాణ కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కలిగిన అన్ని జర్నలిస్టుల సంఘాలతో కలిసి జాతీయ మహాసభలను ఘనంగా నిర్వహిస్తామన్నారు . ఈ విలేకరుల సమావేశంలో అమరవరపు కోటేశ్వరావు , చేరుకుపల్లి శ్రీనివాస్, తప్పెట్ల దేవదానం , కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.