నవంబర్ నెలాఖలోగా పోడు భూముల సర్వే పూర్తి చేయాలి:: మంత్రి సత్యవతి రాథోడ్
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి
నవంబర్ నెలాఖలోగా పోడు భూముల సర్వే పూర్తి చేయాలి:: మంత్రి సత్యవతి రాథోడ్
== ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి
== ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
== పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తులు తదితర అంశాల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర స్త్రీ-శిశు, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
ఖమ్మం, నవంబర్ 11(విజయంన్యూస్):
నవంబర్ నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభలు, డివిజన్ సభలు , జిల్లా సభలు పూర్తి చేయాలని రాష్ట్ర స్త్రీ-శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోడు భూముల సర్వే ,ధరణి దరఖాస్తులు తదితర అంశాల పై, రాష్ట్ర సిఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ లు, ఎస్పీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోడు భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా పూర్తిచేయాలని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజల సందేహాలు నివృత్తి చేస్తూ కట్టుదిట్టంగా సర్వే పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: మా పైసలేప్పుడిస్తరు సారూ..?
డిసెంబర్ నెల మొదటి వారంలో అర్హులైన వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని, నెలాఖరు వరకు పోడు భూముల సర్వే, గ్రామ, డివిజన్, జిల్లా స్థాయి సభల నిర్వహణ పూర్తి చేయాలని మంత్రి అన్నారు. జిల్లాలలో ఎట్టి పరిస్థితులలో నూతన అటవీ భూముల ఆక్రమణకు అనుమతించరాదని, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. భవిష్యత్తులో అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా గ్రామ సభల్లో తీర్మానం చేయాలని మంత్రి తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు భూ సర్వే పనులు, గ్రామసభల నిర్వహణ పూర్తి కావాలని, దీని కోసం రాష్ట్ర సిఎస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మంత్రి తెలిపారు.
అనంతరం సిఎస్ సోమేష్ కుమార్ పోడు భూముల సర్వే ప్రక్రియ పురోగతిపై జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు. ధరణి టిఎం 33 మాడ్యులలో పెండింగ్ దరఖాస్తుల పురోగతి పై జిల్లాల వారీగా సమీక్షించారు. ధరణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిఎస్ కలెక్టర్లను ఆదేశించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 ను అమలుచేయాలన్నారు. ఈ యాక్ట్ ననుసరించి వచ్చిన ఆర్జీలను నిర్ణీత కాలంలోగా పరిష్కరించాలన్నారు.
ఇది కూడా చదవండి: గో బ్యాక్ ప్రధాని అంటూ ధర్నా
వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, జిల్లాలో వచ్చిన 18295 దరఖాస్తులు, 42,409.11 ఎకరాలలో హక్కులు కొరకు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2398 దరఖాస్తులు పరిశీలించినట్లు ఆయన అన్నారు. నవంబర్ 20 నాటికి సర్వే పూర్తికి చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ, అటవీశాఖ పోలీస్ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తున్నట్లు, నూతన అటవీ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి డా. షబరీష్, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణా నాయక్, ఆర్డీవో సూర్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.