చిన్నారులతో ఆత్మీయంగా
== విద్యార్థిగా మారి.. పాఠాలు విని
== విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
== వైరా పాఠశాలను అకస్మీకంగా తనిఖీ చేసిన కలెక్టర్
వైరా/ఖమ్మం,మార్చి,10(విజయంన్యూస్):`
ఆయనో కలెక్టర్.. ఆకస్మీకంగా విద్యార్థిగా మారారు.. పాఠశాలకు వెళ్లారు.. బల్లాపై కుర్చున్నారు.. పంతులు చెప్పే పాఠాలను విన్నారు.. రాసుకున్నారు.. ఆ తరువాత విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.. ఆప్యాయంగా మాట్లాడారు.. ఆత్మీయత చూపించారు.. విద్యార్థుల లక్ష్యాన్ని అడిగి తెలుసుకున్నారు.. పలు సూచనలు చేశారు.. అనంతరం పాఠశాలల అభివద్ది పనులను పరిశీలించారు. మన ఊరు`మన బడి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ శుక్రవారం ఆకస్మిక తణిఖీ చేశారు. వైరా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల, తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, బాలికల జూనియర్ కళాశాలల్లో రూ.65 లక్షలతో జరుగుతున్న అభివృద్ధి పనులు, అదనపు గదుల నిర్మాణం, కిచెన్ షెడ్, టాయిలెట్స్, ఫ్లోరింగ్, కాంపౌండ్వాలు, త్రాగునీరు, సంపు, వైరింగ్ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
ఇదికూడా చదవండి: “తగ్గేదేలే అంటున్న” ఇసుక మాఫియా
అనంతరం కలెక్టర్ వైరా మండల కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు ముమ్మరం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగశేషు, పంచాయితీ రాజ్ ఇఇ కెవికె. శ్రీనివాస్, వైరా మునిసిపల్ ఇంచార్జి కమీషనర్ అనిత, తహసీల్దార్ అరుణ, డి.ఇ. నవీన్, మండల ఎడ్యుకేషనల్ అధికారి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.