Telugu News

సీఎం కేసీఆర్ పై భద్రాద్రి ఎమ్మెల్యే ఫిర్యాదు

0

సీఎం కేసీఆర్ పై భద్రాద్రి ఎమ్మెల్యే ఫిర్యాదు

== భద్రాద్రి వాసులను మోసం చేశారని సీఎం పై ఫిర్యాదు చేసిన పోడెం వీరయ్య

== భద్రాచలం అభివృద్ధికి నిధులు ఇస్తానన్న సీఎం ఇవ్వలేదన్న ఎమ్మెల్యే

== గతేడాది వరదల సమయంలో రూ.1,000 కోట్లు ప్రకటించి పట్టించుకోలేదని ఆరోపణ

== కేసీఆర్‌‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

(భద్రాద్రికొత్తగూడెం ప్రతినిధి-విజయంన్యూస్)

భద్రాచలం అభివృద్ధికి సహాకరిస్తామన్నారు.. వరదల నుంచి భద్రాద్రి వాసులను, ఏజెన్సీ బిడ్డలను కాపాడతామన్నారు.. రూ.1000 కోట్ల నిధులు ప్రకటించారు.. కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు.. ప్రకటించి ఏడాది కావోస్తున్నప్పటికి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదు.. భధ్రాద్రి సీతారామయ్య సాక్షిగా ప్రకటించిన నిధులు మంజూరు చేయకుండా గిరిజన ప్రజలను మోసం చేసిన సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని  భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య సోమవారం భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఫిర్యాదును అందజేశారు.  ఈ సందర్భంగా పొడెం వీరయ్య మీడియాతో మాట్లాడుతూ ‘‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు నెరవేర్చలేదు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ఆయన మోసం చేశారు. గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు” అని పొదెం వీరయ్య మండిపడ్డారు. ‘‘గత ఏడాది వరదల సమయంలో భద్రాచలం పట్టణాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన ముఖ్యమంత్రి.. కరకట్ట పటిష్టత, ఎత్తు పెంచడానికి, ముంపు కాలనీల ప్రజలకు పునరావాసం కల్పించడానికి రూ.1,000 కోట్లు ప్రకటించారని గుర్తు చేశారు.  ఏడాది గడిచినా నిధులు మంజూరు చేయలేదు” అని చెప్పారు. వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ గోదావరి ఉప్పొంగే అవకాశం ఉందని, ఈ సంవత్సరం కూడా భద్రాచల ప్రాంత ప్రజలు గోదావరి ముంపునకు గురికావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి వస్తుందటే నా గిరిజన, ఆదివాసి బిడ్డలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరకట్ట కడతానని, భద్రాచలంకు చుక్క నీరు రాకుండా చూస్తామని సీఎం కేసీఆర్ గొప్పగొప్ప మాటలు చెప్పారని, కనీసం తట్టెడు మట్టి కూడా పోసింది లేదన్నారు. అనేక సార్లు వినతులిచ్చిన చెత్తబుట్టలో వేస్తున్నారని అన్నారు.  అమలుకునోచుకుని, చేతగాని హామిలను ప్రకటించడంలో సీఎం కేసీఆర్ సిద్దహస్తుడని విమ్మర్శించారు. భద్రాచలం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏజెన్సీ బిడ్డగా, ఆదివాసి బిడ్డగా ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు. మా అదివాసి బిడ్డలను కాపాడుకునేందుకు, భద్రాచలం రామయ్య గడ్డను కాపాడుకునేందుకు నేను ఎల్లప్పుడు సిద్దంగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైయ్యారు.