ఖమ్మం జిల్లాకు సీఎం కేసిఆర్ వరాల జల్లు
== ఒక్కోక్క పంచాయతీ రూ.10లక్షలు
== ఒక్కోక్క మున్సిపాలటీలకు రూ.30కోట్లు
== ఖమ్మం నగరానికి రూ.50కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
== జర్నలిస్టులకు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్
== నేల రోజుల్లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రులకు ఆదేశం
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా అద్భుతంగా అభివద్ది పథంలో నడుస్తోందని, ఖమ్మం నగరం కూడా మరింతగా అభివద్ది చెందిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కొనియాడారు. గతంలో మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అజయ్ హయంలో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ముందుకెళ్తోందని అన్నారు. ఖమ్మం మునిసిపాలిటీకి రూ.50 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మున్నేరుపై కొత్త బ్రిడ్జీని నిర్మిస్తామని ప్రకటించారు. మధిర,సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీలకు తలో రూ.30 కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్’ పుల్ జోష్.. సీఎం ఖుషి
ఖమ్మం జిల్లాలోని 589 పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. 10 వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
== జర్నలిస్టులకు వరాలు
ఇదే సందర్భంలో ఖమ్మం నగరంలో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఆవిర్భావ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ సిఎంలు కేజ్రీవాల్, మాన్, పినరయ్ విజయ్, మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, రాష్టాన్రికి చెందిన లెఫ్ట్ నేతలు కూనంనేని సాంబశివరావు,తమ్మినేని వీరభద్రం, రాష్ట్రమంత్రులు, బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అయితే జర్నలిస్టులకు వరాలు ప్రకటించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లా టీయుడబ్ల్యూజే టీజేఎఫ్, ఐజేయు నేతలు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎంలు