Telugu News

అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది: మంత్రి పువ్వాడ

విద్యాదినోత్సవం కార్యక్రమంలో అధికారులకు సూచించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0
అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది: మంత్రి పువ్వాడ
== ఏదైనా పొందగలం..కానీ..జ్జానాన్ని పొందలేము
== సరైన సమయంలో నాణ్యమైన విద్యాబోధన అందాలి

== విద్యాదినోత్సవం కార్యక్రమంలో అధికారులకు సూచించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, జూన్ 20(విజయంన్యూస్):

 అన్ని దానాల్లో విద్యా దానం గొప్పదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం పురస్కరించుకుని డిపిఆర్ సి భవనంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఏదైనా పొందగలం కానీ, జ్ఞానాన్ని పొందలేమని, సరైన సమయంలో, సరైన వయస్సులో మంచి విద్యా బోధన అందాలని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. విద్యా దినోత్సవంన మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాలలు పునఃప్రారంభం తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని, పిల్లలు తమ పాఠశాలలో టాయిలెట్స్, త్రాగునీరు, డ్యూయల్ డెస్కులు, పెయింటింగ్ లు చూసి ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు.
పాఠశాలల ప్రారంభంతోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందజేశామన్నారు. పిల్లలకు మంచి పౌష్టికాహారం రాగి జావ మంచి కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వ రంగంలో విద్యను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. ఇంతకాలం ఆర్థిక స్థోమత లేకున్నా, ఇంగ్లీష్ మీడియం కోసం ప్రయివేటు పాఠశాలకు పంపేవారన్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంతో తల్లిదండ్రుల్లో నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. డిజిటల్ క్లాసులు, లైబ్రరీలు ఏర్పాటు చేశామన్నారు. 75 సంవత్సరాల సమయంలో జిల్లాకు మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు ఈ సంవత్సరంలో మంజూరు అయ్యాయన్నారు. తెలంగాణ వస్తే ఏమి వస్తది అనే దానికి ఈ 9 సంవత్సరాల ప్రగతి సమాధానం అని ఆయన తెలిపారు. ఇంత ఖర్చు పెట్టాక, పాఠశాలల నమోదు పెరగాలని, ఉత్తీర్ణత పెరగాలని ఆయన అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమ అమలులో జిల్లా మొదటి స్థానంలో ఉందని, జిల్లా కలెక్టర్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
ఇది కూడా చదవండి: కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ పాఠశాల అభివృద్ధి: సండ్ర
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, విద్యా దినోత్సవం న అన్ని పాఠశాలల్లో పండగ వాతావరణం కన్పించిందన్నారు. కోట్లకొద్ది రూపాయలు పాఠశాలలపై ఖర్చు పెడుతున్నట్లు, దీని ఫలితం ఇప్పుడు కన్పిస్తుందని అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి దఫాలో 426 పాఠశాలలు రూ. 150 కోట్లతో అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకున్నట్లు తెలిపారు. 130 పాఠశాలలు పూర్తయినట్లు, మిగతావి జూన్ నెలాఖరులోగా పూర్తి అవుతాయని ఆయన అన్నారు. అన్ని వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు సంతోషంగా చదువుకుంటారన్నారు. వసతుల కల్పనతో పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. 8,9,10 తరగతుల కోసం ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం లు ఏర్పాటుచేసామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లైబ్రరీలు, రీడింగ్ కార్నర్ లు ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. వారంలో 2 లైబ్రరీ గంటలు పెట్టాలన్నారు. రాగి జావ కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సౌకర్యాలు అన్ని వచ్చాయని, ఇప్పుడు బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, పిల్లలకు మంచి చదువు అందించి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: రేపు పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి
కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, బడ్జెట్ లో 7 వేల కోట్లు కేటాయించి, విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చామన్నారు. ప్రభుత్వ పస్తశాలలు కార్పొరేట్ స్కూళ్లను మించిపోయాయన్నారు. 9 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ప్రొ. జయశంకర్ బడి బాట కార్యక్రమంతో అడ్మిషన్లు పెరిగాయని ఆయన తెలిపారు. విద్యా తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కష్టపడుతుందన్నారు.ఈ సందర్భంగా విద్యా శాఖ బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులు, మన ఊరు-మన బడి కార్యక్రమ పనులు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎoసిలు, 10 జీపీఏ సాధించిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, మెమోంటో లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖంన్7మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, స్థానిక కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.