Telugu News

గిరిజనులకు శుభవార్త చెప్పిన సీఎం

ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ..

0

గిరిజనులకు శుభవార్త

== ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ..

== ఆసిఫాబాద్‌లో గిరిజనులకు సీఎం కేసీఆర్‌ పోడు పట్టాలు పంపిణీ.

== భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ లు పోడు పట్టాలు పంపిణీ.

== తీరనున్న గిరిజనుల దశాబ్దాల కల..

== పోడు సమస్యకు కేసీఆర్‌ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.

== రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,06,369 ఎకరాలకు గాను 1,51,146 పోడు రైతులకు పట్టాలు.

== పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం.

== అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించిన సీఎం కేసీఆర్ కి మంత్రి పువ్వాడ ప్రత్యేక కృతజ్ఞతలు.

(ఖమ్మం-విజయంన్యూస్)

అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పిస్తూ గౌరవ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్‌ 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. అటవీ భూములపై ఆధారపడిన వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కేసిఆర్ మానస పుత్రిక గృహ లక్ష్మి పథకం: మంత్రి

గతంలోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,06,369 ఎకరాలకు గాను 1,51,146 పోడు రైతులకు పట్టాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు అత్యధికంగా పొడు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,51,195 ఎకరాలకు గాను 50,595 మంది గిరిజనులకు మంత్రి హరీష్ రావుతో కలిసి పువ్వాడ అజయ్ కుమార్ పట్టాలు అందించనున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు పోడు భూముల పట్టాలు నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో పోడు పట్టాలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అందించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు. పోడు పట్టాల పంపిణీతో అటవీ భూముల అన్యాక్రాంతానికి చెక్‌ పెట్టాలని సర్కారు నిర్ణయించిందని, తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగిస్తుందని, తద్వారా ఆక్రమణలకు అవకాశం లేకుండా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయం గా అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు. పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇకపై అంగుళం భూమి ఆక్రమణలకు గురి కాకుండా పక్కాగా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దశాబ్దాల పాటు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పోడు రైతుల కలను సీఎం కేసీఆర్‌ సాకారం చేసారని రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులు అందరి తరపున మంత్రి పువ్వాడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: దేవుని పై జీవిత సత్యం చెప్పిన మంత్రి