కమాండర్ అభినందన్కు పదోన్నతి!
గ్రూప్ కెప్టెన్ గా పదోన్నతి కల్పించిన భారత వైమానకదలం
(దిల్లీ-విజయం న్యూస్)
బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత వాయసేన దాడుల అనంతరం భారత్, పాక్ మధ్య జరిగిన ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు తాజాగా పదోన్నతి లభించింది. కమాండర్ నుంచి గ్రూప్ కెప్టెన్గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అనేది సైనికదళంలో కల్నల్ ర్యాంక్తో సమానం. బాలాకోట్ ఘటన జరిగిన మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 27న పాక్ వైమానిక దళం ఎఫ్-16 విమానంతో భారత్పై దాడికి యత్నించగా.. భారత వైమానిక కమాండర్ అభినందన్ మిగ్-21 విమానంతో వెంటాడి నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్ సాయంతో కిందకు దూకగా అది పాక్ భూభాగంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. కాగా.. అభినందన్ను తిరిగి అప్పగించాలని భారత్ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్కు అప్పగించింది. చికిత్స కోసం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అభినందన్ తిరిగి విధుల్లోకి చేరి దేశసేవను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అభినందన్కు పదోన్నతి దక్కింది. పాక్ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్ చక్ర అవార్డుతో సత్కరించింది.