Telugu News

ఖమ్మాన్ని హైదరాబాద్ కు దీటుగా  అభివృద్ధి చేస్తా: మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్ దయతోనే అభివద్ది సాధ్యమైంది

0

ఖమ్మాన్ని హైదరాబాద్ కు దీటుగా  అభివృద్ధి చేస్తా: మంత్రి పువ్వాడ

== ఖమ్మంను సుందరంగా చూడటమే లక్ష్యం
== మురుగునీటి గోళ్లపాడును సుందరంగా తీర్చిదిద్దా
== ప్రతి వీధి అద్భుతంగా ఉంది
== సీఎం కేసీఆర్ దయతోనే అభివద్ది సాధ్యమైంది
ఖమ్మం ప్రతినిధి,ఆగష్టు,22(విజయంన్యూస్)
ఖమ్మం నగరాన్ని అన్ని రంగాలలో హైద్రాబాదు నగరానికి ధీటుగా అభివృద్ధి పర్చడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.  మంగళవారం నగరంలో పలు డివిజన్‌ లలో రూ.2.10 కోట్లతో పలు అభివృద్ది పనులకు మంత్రి  శంకుస్థాపన చేశారు.  18వ డివిజన్‌ శ్రీరాం నగర్‌ రోడ్‌ నెం.5 లో రూ.కోటి తో నిర్మించనున్న  సీసీ డ్రైన్‌ నిర్మాణ పనులకు,  31వ డివిజన్‌ గ్రైన్‌ మార్కెట్‌ ఎదురుగా రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ సైడ్‌ డ్రైన్‌ నిర్మాణ పనులకు,

33వ డివిజన్‌ గాంధీ నగర్‌ లో రూ.40 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్స్‌ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులను మంజూరు చేయించి నగరాన్ని అభివృద్ధి పర్చడం జరిగిందని  ఖమ్మం నగరం అభివృద్ధిలో రాష్ట్రంలో ముందంజలో ఉందని, ఇంకా చేపట్టాల్సిన అనేక పనులు ఉన్నాయని, నగర అబివృద్ధికి నిధులు సమకూర్చి  ఆవిష్కరణలు, కొత్త పనులు చేపట్టాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే నగర స్వరూపాన్ని మర్చేశామని ఇంకా మిగిలి ఉన్నది కూడా పూర్తి చేస్తే తన బాధ్యత నెరవేరుతుందన్నారు.  సంక్షేమం, అభివృద్ధిని సమానంగా తీసుకెల్లామని మంత్రి అన్నారు.  కేవలం గోళ్లపాడు మురుకి కాల్వ అభివృద్ది కోసమే రూ.100 కోట్లతో అభివృద్ది చేశామని అన్నారు. మున్నేరుపై ఎప్పుడో బ్రిటిష్‌ వారు నిర్మించిన బ్రిడ్జి శిధిలావస్థకు చేరిందని, ముఖ్యమంత్రి కేసీఅర్‌ గారి చొరవతో అక్కడ రూ. 180 కోట్లతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఇది ఎవరైనా ఊహించారా అని ప్రశ్నించారు.ఇంటింటికీ కళ్యాణలక్ష్మీ, ఆసరా పెన్షన్‌ చెక్కులు ఇచ్చామని, ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధమైన త్రాగునీరు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మేయర్‌ పునుకొల్లు నీరజ, మునిసిపల్‌ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌ కుమార్‌, ఈ ఈ పబ్లిక్‌ హెల్త్‌ రంజిత్‌, స్థానిక కార్పొరేటర్‌ లు, స్థాని ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.