నిరుద్యోగ యువత ఛలో ఖమ్మం: సంభాని
== నిరుద్యోగులారా..రండీ.. నిరుద్యోగ నిరసన ర్యాలీని సక్సెస్ చేయండి
== రాబోయే ది ఇందిరమ్మ రాజ్యమే: వీహెచ్
== విలేకరుల సమావేశంలో కేంద్రంపై మండిపడిన కాంగ్రెస్ నేతలు
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని, నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ఖమ్మంలో ఈ నెల 24న చేపట్టే నిరుద్యోగ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని, నిరుద్యోగ యువత కదిలిరావాలని మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో దేశంలో 2కోట్ల ఉద్యోగాలు, రాష్ట్రంలో ఇంటికి ఉద్యోగం ఇస్తానని మాయమాటలు చెప్పి మెప్పించి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 9ఏళ్ళు గడిచిన ఉద్యోగాలు ఇవ్వకపోగా, పేపర్ లీకేజీలు చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉద్యమాల గుమ్మం ఖమ్మం..తెలంగాణ ఉద్యమ పోరాటం ప్రారంభమైన జిల్లా ఖమ్మం జిల్లా అని అన్నారు. ఉద్యోగాలు కోసం నిరుపేద యువకులు ఎంతో ప్రయాసపడి వ్యవసాయం చేస్తే వచ్చే డబ్బులను కూడా చదువులకు ఖర్చు చేసి ప్రాణాలను, భవిష్యత్తు ను తాకట్టు పెట్టి చదివితే ప్రభుత్వాలు పేపర్లను అమ్ముకుంటూ పేదప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమ్మర్శలు చేశారు. అందుకే నిరుద్యోగులకు అండగా ఉండాలనే ఆలోచనతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నిరసన ర్యాలీకీ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత తరలి రావాలని కోరారు.
== రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే: వీహెచ్
రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీహెచ్ హనుమంత్ రావు జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని దేశ ప్రజలు చూస్తున్నారని అన్నారు. దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాన్ని కేంద్రప్రభుత్వం రాజకీయ కుట్రతో ఎంపీ పదవిపై వేటు వేశారని అన్నారు. దేశ ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై దేశ ప్రజలు గుర్రుగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా కేంద్రానికి బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ నగర కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ జావిద్ సభ్యులు రాయల నాగేశ్వరావు, పుచ్చకాయల వీరభద్రం, వడ్డే నారాయణరావు, బెల్లం శ్రీనివాస్, బాలు నాయక్, రాపోలు జయప్రకాష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంతోష్ తదితరులు హాజరయ్యారు.