Telugu News

తెల్దారుపల్లిలో పర్యటించిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం

తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిని పరిశీలించిన సీపీఎం నేతలు

0

తెల్దారుపల్లిలో పర్యటించిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం

== తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిని పరిశీలించిన సీపీఎం నేతలు

== గ్రామస్థుల దాడిలో దెబ్బతిన్న ఇళ్ల సందర్శన

== పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇళ్లపై  దాడికి ఖండించిన నాయకులు

ఖమ్మంరూరల్, సెప్టెంబర్‌ 3(విజయంన్యూస్):

ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధి బృందం శనివారం సందర్శించింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఎదురొచ్చి ఈ ప్రతినిధి బృందానికి ఆహ్వానం పలికారు. విధ్వంసకారుల దాడిలో దెబ్బతిన్న పార్టీ సానుభూతిపరులు, నాయకుల ఇళ్లను బృందం సందర్శించింది. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించింది. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు తమ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా సహకరిస్తారని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చెప్పింది. హత్యాఘటనతో సంబంధం లేని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల ఇళ్లపై దాడుల చేయడాన్ని , మరోమారు హత్యోందతాన్నీ పార్టీ ఖండించింది.

allso read- గల్లీ (కో ) బెల్ట్ దుకాణం…

== సీపీఐ(ఎం) సానుభూతిపరుల ఇళ్లపై దాడి సరికాదు: సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని, జిల్లా కార్యదర్శి నున్నా

ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో ఆగష్టు 15న చోటుచేసుకున్న హత్యోదంతంతో పాటు దాన్ని ఆసరా చేసుకుని ఆ ఘటనతో సంబంధం లేని వారి ఇళ్లపై కొందరు దాడులకు పాల్పడటాన్ని సీపీఐ(ఎం) ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు. దుండగుల దాడిలో ధ్వంసమైన పార్టీ నాయకుల ఇళ్లను శనివారం సందర్శించారు.కుటుంబసభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమ పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇళ్లను ధ్వంసం చేయడంతో పాటు అసత్య ఆరోపణలు చేసి కేసులో ఇరికించారని తెలిపారు. కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని చెప్పారు. గ్రామంలో సీపీఐ(ఎం) బలంగా ఉన్నప్పటికీ సంయమనం పాటించాలని కార్యకర్తలకు హితబోధ చేశామన్నారు. తమవైపు నుంచి గ్రామంలో ఎటువంటి సంఘటన జరగకూడదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించామన్నారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా సహకరించాలని చెప్పామన్నారు. విధ్వంసకారుల దాడిలో ధ్వంసమైన పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఇళ్లను సందర్శించామన్నారు. బాధితులకు మనోధైర్యం కల్పించేందుకే గ్రామానికి వచ్చామన్నారు. హత్యోదంతనానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఘటన చోటుచేసుకున్న రోజు నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. హత్యా ఘటనను ఆసరా చేసుకుని తమ పార్టీని దెబ్బతీయాలని, తమ నాయకులు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలని తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు.

allso read- తెల్దారుపల్లి హత్యకేసులో మరో మలుపు

పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదలు, స్థానిక నాయకత్వంపైన తప్పుడు ఆరోపణలు చేసే చర్యలు సరికాదన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. విధ్వంసకారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పోలీసులకు సహకరించాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు సూచించారు. గతంలో గ్రామం ఎంత ప్రశాంతంగా ఐక్యంగా ఉందో దాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తామన్నారు.

== సంయమనం పాటిస్తే దుష్పప్రచారమా..?

దుండగుల విధ్వంసంలో దెబ్బతిన్న ఇళ్ల యజమానులు, కుటుంబ సభ్యులను కొన్నిరోజుల క్రితమే పరామర్శించాలని భావించామన్నారు. దీనిపై పోలీసు అనుమతి కోరామని, వారి సూచన మేరకు ఇప్పటి వరకు ఆగామన్నారు. అయినప్పటికీ కొందరు పనికట్టుకుని  దుష్పప్రచారం చేశారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రామంలోకి రాకుండా స్థానికులు అడ్డుకున్నట్లు తప్పుడు ప్రచారం సాగించారన్నారు. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి గ్రామస్తుల నుంచి నేడు లభించిన ఆహ్వానంతో అవన్నీ దుష్పప్రచారమేనని తేటతెల్లమైందన్నారు. తెల్దారుపల్లి మొదటి నుంచి కమ్యూనిస్టు గ్రామమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తమ్మినేని సుబ్బయ్య నాయకత్వంలో స్థానికులు జమీందార్లకు వ్యతిరేకంగా పోరు సల్పిన విషయాన్ని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) కృషి ఫలితంగానే గ్రామస్తులు సంఘటితంగా ఉండి ఎర్రజెండా నీడన గ్రామావృద్ధి సాధించుకున్నట్లు చెప్పారు. బాధితులను పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, భూక్యా వీరభద్రం, బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరావు, వై.విక్రమ్‌, గ్రామ సర్పంచ్‌ సిద్దినేని కోటయ్య, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.