Telugu News

కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు

* శాస్త్రీయ విధానంతో ముందుకెళ్లాలి..

0

కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు

* శాస్త్రీయ విధానంతో ముందుకెళ్లాలి..

* వామపక్ష ప్రజాతంత్ర సంఘటనపై దృష్టి

* సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా విస్తృత సమావేశంలో

పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

(పెండ్ర అంజయ్య, ఖమ్మ- ప్రతినిధి-విజయం న్యూస్);-
కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర సంఘటనపై దృష్టి సారించి శాస్త్రీయ దృక్పథంతో ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా విస్తృత సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన నగరంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించారు.

ఈ ప్లీనరీని ఉద్దేశించి తమ్మినేని మాట్లాడారు. ఏప్రిల్‌లో కేరళలోని కన్నూరులో జరిగిన పార్టీ జాతీయ మహాసభలో నిర్ణయాలను రాష్ట్ర, జిల్లా పరిస్థితులకు అన్వయిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖలను చేశారు. దేశవ్యాప్తంగా మితవాద ధోరణులు పెరుగుతున్నాయన్నారు. ప్రాంతీయ పార్టీల ధోరణులను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందన్నారు. లౌకిక శక్తులను కూడగట్టడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. గ్రామీణ వ్యవసాయేతరులను సంఘటితం చేయాలన్నారు. నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విద్యావిధానంపై దృష్టి సారించాలన్నారు.

also read :-ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గ్రీవెన్స్ డే

సాంస్కృతిక రంగం ఆలోచనా విధానంలో మార్పులు తీసుకు వచ్చేందుకు కృషి చేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. సమస్యలపై ఐక్య పోరాటాలను విస్తృతం చేయాలని సూచించారు. బూర్జువా పక్షాలు శాశ్వత ప్రాతిపదికన ఏ అంశాన్ని అమలు చేయవని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాసంఘాలను బలోపేతం చేసి స్థానిక ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లౌకికతత్వం, విద్యా, వైద్యం, ఉద్యోగాల కల్పనకు కమ్యూనిస్టుల బలోపేతం అవసరమన్నారు. అటువంటి కమ్యూనిస్టులు లేకుండా దేశానికి భవిష్యత్తు లేదన్నారు. ఓట్లు, సీట్లు ఎన్నికలప్పుడే కానీ ప్రజా పోరాటాలు నిర్విరామంగా కొనసాగాలన్నారు. అంతకుముందు పార్టీ జాతీయ మహాసభ రాజకీయ తీర్మానంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ప్రసంగించారు.

also read :-దమ్మపేట మండలం లో మూడవ రోజు పాదయాత్రలో షర్మిల.

గత నాలుగేళ్లలో పార్టీ నిర్వహించిన పోరాటాలతో పాటు రాబోయే మూడేళ్ల రాజకీయ విధానంపై వివరించారు. సోషలిజమే ప్రపంచానికి పరిష్కారమని సూచించారు. పార్టీ భవిష్యత్తు మూడేళ్ల కర్తవ్యాలను జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్లీనరీ ముందు ఉంచారు. ప్రారంభంలో ఇటీవల మరణించిన పార్టీ నాయకులకు నివాళి అర్పిస్తూ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, వై. విక్రమ్, బొంతు రాంబాబు, నవతెలంగాణ జీఎం ఎం. సుబ్బారావు, పార్టీ జిల్లా, మండల, ప్రజాసంఘాలు, హోల్ టైమర్లు తదితరులు పాల్గొన్నారు.