Telugu News

తెలంగాణ దనిక రాష్ట్రం2.7 లక్షలకు చేరనున్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం

32 జిల్లాలు గ్రోత్‌సెంటర్లు..ఐటీ, పరిశ్రమలు అక్కడికే: సీఎం కెసిఆర్

0

తెలంగాణ దనిక రాష్ట్రం2.7 లక్షలకు చేరనున్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం

32 జిల్లాలు గ్రోత్‌సెంటర్లు..ఐటీ, పరిశ్రమలు అక్కడికే: సీఎం కెసిఆర్

(‘తెలంగాణ విజయం న్యూస్):-

‘తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం ఇప్పుడు రూ.2.37 లక్షలు ఉన్నది. త్వరలో 2.70 లక్షలు కాబోతున్నది. ఏ ఆంధ్రప్రదేశ్‌ అయితే మనల్ని వెక్కిరిచ్చిందో వాళ్ల తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉన్నది. మనదేమో రూ.2.70 లక్షలు అవుతున్నది. ఇదీ డిఫరెన్స్‌..అంటే ఎన్నో పనులు, ఎవరూ ఊహించనటువంటి పనులు అద్భుతంగా మనం చేసుకున్నాం.’

also read :-ఖబార్థార్ మోడీ.. భయపెడితే భయపడను : సీఎం కేసీఆర్

తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని సీఎం కేసీఆర్‌ మరోసారి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.7 లక్షలకు చేరబోతున్నదని చెప్పా రు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎకోసిస్టమ్‌ బాగుండటం, కుల, మత కొట్లాటలు లేకపోవడంతోనే పెట్టుబడులు తరలివస్తున్నాయని చెప్పారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.సీఎం కేసీఆర్‌ ప్రసంగం.. ఆయన మాటల్లోనే..

ఎకో నిర్మాణంతోనే భూములకు ధరలు
తెలంగాణ అద్భుతమైన గొప్ప సంపద కలిగిన ధనిక రాష్ట్రం. దీని అసెస్‌మెంట్‌ నాకు తెలుసు. ఇప్పు డు ఎక్కడికి చేరుకున్నమో..ఇంకా ఎక్కడికి పోతమో.. ఎన్ని అద్భుతాలు జరుగుతయో నాకు తెలుసు. నేను మీకు హామీ ఇస్తున్నా. మన దగ్గర ఉండే అద్భుతమైన కాస్మోపాలిటిన్‌ కల్చర్‌ మరెక్కడా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే గతంతో పోలిస్తే భూముల ధరలు పెరిగినయ్‌. గతంలో ఎకరం రెండు, మూడు లక్షలు ఉన్న జనగామలో ఇవాళ రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఎలా అయ్యింది? అందరం కష్టపడి ఒక ఎకో నిర్మా ణం చేసినం. అద్భుతమైన వాతావరణం సృష్టించాం. అందులోకి లోకమంతా వస్తున్నది. ఇండస్ట్రియల్‌ పెట్టుబడులు, ఐటీ కంపెనీలు పరుగెత్తుకొని వస్తున్నయ్‌. ఎవరెవరో ఎంక్వైరీ చేసి మేం వస్తామంటున్నరు. గతంలో చెట్లు నరుకుడు తప్ప.. చెట్లు పెట్టుడు లేకుండే. ఇవాళ అటవీ కళాశాల పెట్టుకున్నాం.. త్వరలో యూనివర్సిటీ చేయబోతున్నాం. మన పోలీసులు అద్భుతమైన లా అండ్‌ ఆర్డర్‌ను మెయింటెయి న్‌ చేస్తున్నరు. ఇక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి. 24 గంటల నీళ్లు, విద్యుత్తు వస్తది.. మంచి రోడ్లు, సదుపాయాలు ఉంటయి. కుల, మత పిచ్చిలేదు. పిచ్చిపిచ్చి కొట్లాటలు లేవు. అందుకే మన దగ్గరకు వస్తున్నారు.

also read :-హిజాబ్ అనే వస్త్రధారణ ముస్లిం మహిళల సంప్రదాయం

పెద్ద రాష్ర్టాలను దాటుతున్నాం
ఒకనాడు చాలా అపవాదులు.. తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయితది. ఒక సీఎం కట్టెపట్టుకొని టీవీ లో చూపించిండు.. మీకు కరెంటే రాదు.. ఆగమైపోతరు.. పరేశాన్‌ అయితరు.. మీకు చేతకాదు.. పరిపాలించుకోరాదు.. ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పిండ్రు. కానీ దేశాన్నే తలదన్నేలా 11 రాష్ర్టాల సీఎంలు వచ్చి చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. మేం కూడా ఇట్లా చేసుకుంటాం అన్నరు. మనకన్నా ముందున్న పెద్ద రాష్ర్టాలన్నింటినీ తలదన్ని ముందుకుపోతున్నాం. కారణం ఏంది? రాష్ట్రం తెచ్చుకున్నాం కదా.. దీన్ని ఎట్లన్న చేసి గెలిపిచ్చుకోవాలే.. ముందరపడాలే. అవుననిపించుకోవాలే అని పట్టుదలతో పనిచేస్తే ఇక్కడి వరకు వచ్చినం. మన హైకోర్టులో జడ్జీలు రిటైర్‌ అయి తే వాపస్‌పోరు. 90 శాతం ఇక్కడే ఉంటారు. మన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మనకు పోస్టింగ్‌లో వచ్చినోళ్లు రిటైర్‌ అయ్యాక ఇక్కడే ఉంటారు.

ఎకరం రూ.కోటి
హైదరాబాద్‌లో రూ.14 కోట్లు, రూ.15 కోట్లు, రూ.25 కోట్లు ఇలా విల్లాలు అమ్ముతున్నారు. ఎక్కడెక్కడనో ఢిల్లీ, ముంబైలో ఉన్న వాళ్లు హైదరాబాద్‌లో ఒక విల్లా కొనుక్కోవాలి అని మాట్లాడుతున్నరు. ఆలేరు నియోజకవర్గంలో వాసాలమర్రి. అక్కడ మీ ఊరిలో భూమి ధర ఎకరం ఎట్లా ఉందని అడిగితే రూ.కోటి సార్‌ అని చెప్పారు. ఈ మొరం గడ్డలు ఎవరు కొంటరు అంటే.. నువ్వే చెప్పినవ్‌ కదా సార్‌ రీజినల్‌ రింగురోడ్డు అని అప్పటినుంచి రోజు వంద కార్లు వస్తున్నయ్‌. భూములు కొంటాళ్లు అని చెప్పారు.

కల్యాణలక్ష్మి పెండ్లిళ్లు 10 లక్షలు దాటినయ్‌
ఏడేండ్లలో చాలా అద్భుతాలు జరిగినయ్‌. మన దగ్గర ఉన్న గురుకుల పాఠశాలలు ఏ రాష్ట్రంలో లేవు. 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో 10 లక్షల మంది పేదింటి పిల్లలకు పెండ్లి చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మనం ఇచ్చే డబ్బుతోనే వాళ్లు పెండ్లి చేసుకునే పరిస్థితి ఉంది. పారదర్శకంగా, అవినీతి రహితంగా పోతున్నాం. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని మొండి నిర్ణయం తీసుకున్నాం. మొదట్లో ఎవరికీ అర్థం కాలే. ఎట్ల పడుతయ్‌ మన దగ్గర రైతుబంధు డబ్బులు. దరఖాస్తు లేదు, రసీదు లేదు.. ఏం లేదు. ఎంత బ్యూటిఫుల్‌గా పడుతున్నాయ్‌.. ఇండియాలో ఎక్కడన్నా ఉంటదా. ఫైనాన్స్‌ సెక్రటరీ హైదరాబాద్‌లో డబ్బు రిలీజ్‌చేస్తే నేరుగా బ్యాంక్‌ ఖాతాలో జమై పోతాయ్‌.. ఎలాంటి ప్రయాస లేదు. నష్టం లేదు.

ఎనిమిది రోజుల్లో రైతుబీమా
గతంలో ఆపద్బంధు అని ఉండేది. నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు చాలామందికి ఇప్పించిన. రైతు చనిపోయిన తర్వాత నాలుగైదు నెలలు పట్టేది. రూ.50 వేలు విడుదల చేస్తే ఆ కుటుంబం చేతికి రూ.20 వేలు నుంచి రూ.25 వేలు వచ్చేవి. ఇవాళ ఒక్క గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రూ.5 లక్షలు ఎనిమిది రోజుల లోపల బ్యాంక్‌ ఖాతాల్లో పడుతున్నయ్‌. ఇవన్నీ ఎవరో చేయలే.. మనమే చేసినం. మొత్తం ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం సీఎస్‌ ఆధ్వర్యంలో అద్భుతమైన సర్వీస్‌ డెలివరీ చేస్తున్నాం. ఇంతకుముందే సీఎస్‌ అన్నారు. సార్‌ ఇవాళ ఏ పని చేయాలన్న నిమిషాల్లో చేయగలుగుతున్నాం. గవర్నమెంట్‌, క్యాబినెట్‌ ఒక నిర్ణయం తీసుకుంటే అమలు చేయాలంటే చేయగలుగుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో 33 అభివృద్ధి కేంద్రాలు
రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించనటువం టి, అద్భుతమైన అభివృద్ధి జిల్లాల్లో జరుగుతుంది. భూముల ధరలు మరింత పెరుగుతాయ్‌. వ్యాల్యూ, వెల్త్‌, పరిశ్రమలు, విద్యా వసతులు, పరిశ్రమలు అన్నీ ఇబ్బడిముబ్బడిగా వస్తయి. మొత్తం హైదరాబాద్‌లోనే కుక్కి, అక్కడే పెట్టేది కాదు. అభివృద్ధి, ఐటీ, పరిశ్రమలు అన్ని గ్రోత్‌ సెంటర్ల (జిల్లాల)కు పోవాలి. తెలంగాణలో ఈ రోజు మనం 33 గ్రోత్‌ సెంటర్లను క్రియేట్‌ చేశాం. హైదరాబాద్‌తోపాటు మరో 32 అభివృద్ధి కేంద్రా లు తయారయ్యాయి. అక్కడి నుంచి వ్యాపించే పరిమళాలు ప్రతి మారుమూల పల్లె, ప్రతి పౌరుడిని, ప్రతి బిడ్డను గొప్పగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కలెక్టరేట్లు, జిల్లాలు.. గొప్ప ఫలితాలు ప్రజలకు అందించాలి.

ప్రజలు ఇంకా బాగుపడాలే. 1985లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు ప్రతిసారి ఎమ్మెల్యేల లొల్లి.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కూడా ఈ లొల్లి చేసేటోళ్లు. అదేందంటే ఆసిఫాబాద్‌, గద్వాల్‌, మెదక్‌లో నారాయణఖేడ్‌, నల్లగొండ, దేవరకొండ, జుక్కల్‌, భూపాలపల్లి, ములుగు ఇలా 20 నియోజకవర్గాలు ఉన్నయి. ఈ మారుమూల ప్రాంతాలకు ఎవరూ పోరు. మరి అవి డెవలప్‌ కావాలి. ఎవరు చేయాలి? అమెరికా నుంచి వచ్చి ఎవరైనా చేస్తరా? చేయరు కదా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఈ విషయంలో చాలా బాధపడ్డాం. చేసేది ఏం లేదు. మాది మాకు కావాలె అని కొట్లాడినం. తెచ్చుకున్నాం. మంచిగ చేసుకున్నాం. ఇవాళ ఆ ప్రాంతాలను కూడా అద్భుతంగా చేసుకుంటున్నాం.