ప్రభుత్వ ఖాళి స్థలాలను ఆక్రమించిన నిరుపేదలు
== ఖాళీ చేయించిన తహసీల్దార్, పోలీసులు
== తాత్కాలిక ఇండ్లను తొలగించిన అధికారులు
(రిపోర్టర్ : వీరయ్య)
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 6 (విజయం న్యూస్):
ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, సుబ్లేడు గ్రామంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది గ్రామస్తులు, నిరుపేదలు స్వాధీన చేసుకునే ప్రయత్నం చేశారు. తాత్కాలిక గుడిసెలను ఏర్పాటు చేసుకున్నారు. సిమెంట్ బిల్లలతో ఇండ్లను నిర్మాణం చేసేందుకు నిరుపేదలు ప్రయత్నం చేశారు. దీంతో అధికారులు వచ్చి వారికి హెచ్చరికలు చేసి అక్కడ ఖాళీ చేయించారు.
ఇది కూడా చదవండి: ఆ టీచర్ మాకే కావాలంటూ విద్యార్థుల ధర్నా
పూర్తి వివరాల్లోకి వెళ్తే తిరుమలాయపాలెం మండలంలోని సుబ్లేడ్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్థలాలలోని ఖాళీ స్థలంను కొంత మంది నిరుపేదలు స్వాధీన పరుచుకుని సిమెంటు ప్రహరీ బిల్లలతో రాత్రికి రాత్రే నిర్మించారు. మరికొందరు శుభ్రం చేసుకుని గుడిసెలు వేసుకున్నారు. దీంతో సమాచారం తెలుసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి, తిరుమలాయపాలెం మండల తాసిల్దార్ కు సమాచారం అందించడంతో తాసిల్దారు డి.పుల్లయ్య పోలీస్ సిబ్బందితో ఆక్రమణకు గురైన స్థలమునకు చేరుకొని నిరుపేదలతో మాట్లాడారు. అక్రమంగా ఇండ్ల నిర్మాణం చేయడం నేరమని, ప్రభుత్వం కచ్చితంగా ఇండ్ల స్థలాలను మంజూరు చేస్తే తప్ప, ఖాళీ స్థలం ఉంది కదా అని అక్రమించుకోవద్దని సూచించారు. అనంతరం వారిని అక్కడ నుంచి పంపించి సిమెంటు తడికలను, గుడిసెలను తొలగించారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా స్వాధీన పరచుకుంటే వారిపై చట్టపరమైన కేసులు పెట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఇళ్ల స్థలాలు కావలసినవారు సంబంధిత గ్రామపంచాయతీలో దరఖాస్తు పెట్టుకోవాలని ఎటువంటి వ్యవసాయ భూమి, ఇంటి స్థలము, ఇల్లు, లేని అర్హులైన గ్రామ నివాసులకు మాత్రమే స్థలాలను కేటాయించడం జరుగుతుందని ఎమ్మార్వో వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాఘవయ్య, పోలీస్ సిబ్బంది గ్రామ సెక్రెటరీ రాజకుమార్, సర్పంచ్ పోలేపొంగు సంజీవయ్య, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
ఇది కూడా చదవండి: పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా