తుమ్మల పార్టీ మార్పు తథ్యమా..?
==నేలకొండపల్లిలో చేసిన వ్యాఖ్యల వెనకాల అంతర్యమేంటి..?
== ఒక్కడే వెళ్తాడా..? అందరితో కలిసి వెళ్తాడా..?
(పెండ్ర అంజయ్య)
ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 5(విజయంన్యూస్)
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. పాలేరు నియోజకవర్గంలో అప్పడప్పుడు పర్యటిస్తున్న ఆయన ఇటీవలే నేలకొండపల్లి మండలంలో పర్యటించి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. ఎప్పుడైనా పిడుగు పడోచ్చు.. ఎప్పుడైనా ఎన్నికలు రావోచ్చు..రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు.. అందరు అందుకు సంసిద్దంగా ఉండాలని పిలుపునివ్వడమే కాకుండా గతంలో చేసిన తప్పిదాలను ఇప్పుడు చేయనని, కార్యకర్తలు, నాయకులందర్ని కలుస్తానని, అందరికి అండగా ఉంటానని భరోసానిచ్చారు. దీంతో ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? లేదంటే తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారా..? అనే సందేహాలు వెల్లువెత్తాయి. రాజకీయ విశ్లేషకులు కూడా కొంత కన్ప్యూజన్ కు గురైయ్యారు. ఆయన మాటల్లో ఏం ఉందో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక్క కుదుపుకుదుపుతున్నాయంటే నమ్మాల్సిందే.
allso read- ఆయన దారేటు..?
== పార్టీ మార్పు తథ్యం..?
తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారేందుకు సంసిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంలో ఓటమి చెందిన తరువాత చాలా రాజకీయ పరిస్థితులు మారాయని, పార్టీకి ద్రోహం చేసిన వారు రాజకీయాలను శాసిస్తున్నారని, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఒపిక పట్టామని తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు చెబుతున్నారు. అంతే కాదు బండి జగదీష్ ను, మాజీ కార్పోరేటర్లను జైల్ కు పంపించిన సమయంలో వారిని పరామర్శించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విలువలు లేకుండా పోయాయని, వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో పెట్టించే సంస్కతి పెరుగుతోందని ఎద్దేవా చేశారు. చాలా బాధపడుతూ ఆయన అనేక సార్లు స్వంత పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు.
allso read- కాంగ్రెస్ లో చేరిన ‘పాలేరు’ ఉద్యమనేత
నా అభిమానులకు అన్యాయం జరుగుతుందని అనేక దఫాలుగా ప్రకటనలు చేశారు. ఇక ఇంకో వైపు సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును వదిలేసి తుమ్మల సమక్షంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ లాంటి పదవులు ఇవ్వడంతో ఆయన మనస్తాపానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అనేక సార్లు ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులకు ఎన్నుకునే అవకాశం వచ్చినప్పటికి అవకాశం ఇవ్వలేదని తుమ్మల నొచ్చుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా తన కార్యకర్తలు, అభిమానులు, వర్గీయులు కూడా అసంత్రుప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరో వైపు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటం, బీజేపీ దూకుడు పెంచడం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాపకింద నీరులా పార్టీ దూసుకపోతుండటంతో టీఆర్ఎస్ పని అయిపోయిందనే కోణంలోనే తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయ భవిష్యత్ లో భాగంగా పార్టీ మారితేనే బాగుంటుందని భావించి తన వర్గీయులతో సమావేశం అయ్యి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ మార్పు తథ్యం అనే వాధనలు వినిపిస్తున్నాయి. నేలకొండపల్లిలో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతే కాదు బీజేపీ పార్టీ దూకుడు పెంచుతూ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసేసమయంలోనే తుమ్మల నాగేశ్వరరావు ఆప్రకటన చేయడంతో కచ్చితంగా పార్టీ మార్పు తథ్యమని పలువురు రాజకీయ విశ్లేషులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ లోకా..? బీజేపీ లోకా..? అనేది సస్పెన్స్ గా ఉంది..?
== కమలం వైపు తుమ్మల చూపు..?
ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు బీజేపీలో చేరే అవకాశం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక వైపు కొమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్రలో ఘాటు వ్యాఖ్యలు చేయడం, ఎమ్మెల్యే ఈటేల రాజేందర్ మాకు చాలా మంది టచ్ లో ఉన్నారని పదేపదే ప్రకటనలు చేయడం, ఇంతలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం, తుమ్మల నాగేశ్వరరావు ఆ వ్యాఖ్యలు చేయడం, దాసోజు శ్రావణ్ కుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం మొత్తం చూస్తుంటే ఓ వ్యక్తి భూ చక్రం తిప్పుతుంటే వీళ్లంతా తిరుగుతున్నట్లుగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకే కచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు బీజేపీ పార్టీలో అతి త్వరలోనే చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తుమ్మలకు ప్రభుత్వం వస్తే కచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని హామినిచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆయన అనుచరగణం చెబుతున్నారు.
== ఒక్కడేనా..? అందరితోనా..?
తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడు పార్టీ మారిన తన బలం, బలగంను తనవెంట తీసుకెళ్లడం మనమంతా చూశాము. టీడీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాను చీపురుపట్టుకుని ఊడ్చేసినట్లుగా ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను పట్టుకుని టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. పార్టీ మారితే ఈనెల 21లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ నెల 21లోపు ఏ క్షణానైనా పిడుగు పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారా..? ఆ పార్టీలోనే ఉండి పైట్ చేస్తారా..? అనేది చూడాల్సిందే..?