Telugu News

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం: భట్టి విక్రమార్క

= గగ్గలపల్లి కార్నర్ మీటింగ్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర సంచలన వ్యాఖ్యలు

0

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తాం: భట్టి విక్రమార్క

== పేదల భూముల జోలికి వస్తే కెసిఆర్ సంగతి చూస్తాం..

== గగ్గలపల్లి కార్నర్ మీటింగ్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర సంచలన వ్యాఖ్యలు

(నాగర్ కర్నూల్/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకుంటే ఖభార్దార్. సీఎం కేసీఆర్.. నీ సంగతి చూస్తాం. మీ సర్కార్ ను కూలుస్తాం. మీ ప్రభుత్వం గుంజుకున్న భూములను చట్టబద్ధంగా తిరిగి వారికి అప్పగిస్తామని” సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, గగ్గలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో గగ్గలపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 183లో దళిత, గిరిజనులకు ఇచ్చిన 200 ఎకరాల భూములను ధరణిలో  బ్లాక్ చేయడం దుర్మార్గమన్నారు.

ఇది కూడా చదవండి: నాడు వైఎస్.. నేడు భట్టి..ఓ సంఘటన..?

దళిత గిరిజనులకు పంపిణీ చేసిన ఈ భూముల జోలికి వస్తే బాగుండదని ఖబర్దార్ అంటూ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ అమలు చేయకపోగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకోవడం దుర్మార్గమన్నారు. స్మశాన వాటికలు, హరితహారం పేరిట దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత గిరిజన బడుగు బలహీనవర్గాల నుంచి గుంజుకున్న భూములను తిరిగి చట్టబద్ధంగా వారికి అప్పగిస్తామని వెల్లడించారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో సమస్త తెలంగాణ సమాజం బాగుండాలని ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ధనిక రాష్ట్రంలో సంపదంత దోపిడీ జరిగిందని, కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో కొలువులు లేక నిరుద్యోగులు, ఇండ్లు లేక పేదలు, పించన్లు రాక వృద్ధులు పడుతున్న ఇబ్బందులు వర్ణాతీతం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 9 నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం నిత్యవసర సరుకుల కోత విధించి బియ్యం మాత్రమే ఇస్తుందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 10 ఏండ్లు కావస్తున్న ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా గాడిదలు కాస్తుందా అని విమర్శలు గుప్పించారు. పంట పొలాలకు సాగునీరు అందించే పిల్ల కాలువలను కూడా తవ్వ కుండా దున్నపోతు వలే బిఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతున్నందున గగ్గలపల్లి గ్రామంలో 2500 ఎకరాల భూములకు సాగు నీరు అంధక రైతులు నష్టపోవలసిన దుస్థితి వచ్చిందని ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ అని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం: భట్టి విక్రమార్క

నియోజకవర్గంలో రైతుల పొలాలకు సాగు నీరు ఇవ్వవలసిన పిల్ల కాలువలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిచేసిన కాలువల్లో పారుతున్న నీళ్లను తామే ఇచ్చామని చూయిస్తూ శిలాఫలకాలు కట్టుకొని వాటి ముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి సిగ్గుండాలని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయకపోవడం వల్ల రైతుల ఖాతాలు బ్యాంకుల్లో బ్యాడ్ అకౌంట్స్ గా మారి బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం వల్ల  వడ్డీలకు అప్పులు తెచ్చుకొని సాగుకు పెట్టుబడి పెట్టుకోవాల్సిన దుస్థితి రైతులకు ఎదురైందన్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడాలని అన్నారు. జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ తదితర రోడ్ల వెంట 15 రోజులుగా రైతులు ధాన్యం కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఏమైనా గాడిదలు కాస్తుండ్రా అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించే గొంతుకల పట్ల ఈ ప్రభుత్వం నియంత్రంగా నిర్బంధం ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. భయం, భయం గుప్పిట్లో బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని భయం పడగ నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రంలో వచ్చే ఐదు నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుదామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: సీఎంను వదలని పొంగులేటి